10, జులై 2019, బుధవారం

ఓదార్చి.. సేదతీర్చి మనోబలాన్నిచ్చి!

ఓదార్చి.. సేదతీర్చి మనోబలాన్నిచ్చి!
కెరియర్‌ గైడెన్స్‌ - సైకాలజీ
సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మానవ సంబంధాలు రోజు రోజుకీ సంక్లిష్టమవుతున్నాయి. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం... ఇలా జీవితంలోని ప్రతి దశలోనూ ఒత్తిడి, ఆందోళన. నిర్ణయాలు తీసుకోలేకపోవడం,  ప్రవర్తనపై నియంత్రణ కోల్పోవడం, ఏది సరైందో.. ఏది కాదో తేల్చుకోలేక బాధలతో నలిగిపోతున్నారు. ఒక్కోసారి జీవితాన్ని ముగించడానికి సిద్ధమైపోతున్నారు. ఇలాంటి వారిని ఓదార్చి, సేద తీర్చి, మనోధైర్యాన్ని నింపి మళ్లీ జీవితంపై నమ్మకం పెంచేవాళ్లే  మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఈ ఉదాత్తమైన ఉద్యోగాన్ని చేయాలంటే కొన్ని కోర్సులు చేయాలి. ఆధునిక సమాజంలో సైకాలజీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.
ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కలిగి ఉండాలి. దాన్ని అందించేందుకు మనిషి ప్రవర్తన, మనస్తత్వాలను అధ్యయనం చేసి, విశ్లేషించి అవసరమైన పరిష్కారాలను సూచించే శాస్త్రమే సైకాలజీ. ఈ నిపుణులకు ఆదరణ పెరగటంతో యువతరం సంబంధిత కోర్సుల్లో చేరటానికి ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఆత్మవిశ్వాసం, ఉత్తమ భావవ్యక్తీకరణ, ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ మార్గదర్శకులుగా వ్యవహరించే నేర్పు, ఓర్పు ఉన్నవారికి తగిన చదువులివి.
పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో సైకాలజీని ప్రధాన అంశంగా చదివినవారిని మనస్తత్వశాస్త్ర నిపుణులు అంటారు. ఈ శాస్త్రాన్ని వృత్తిగా చేసుకోవాలంటే క్లినికల్‌ లేదా కౌన్సెలింగ్‌ సైకాలజీలో ఎం.ఫిల్‌ లేదా పీహెడ్‌డీ చేసి ఉండాలి. పునరావాసం లేదా క్లినికల్‌ సైకాలజీలో ఎం.ఫిల్‌. లేదా పీహెచ్‌డీ చేసిన వారిని భారత పునరావాస మండలి అధికారికంగా గుర్తించి వారు సొంతంగా వృత్తి నిర్వహించుకోడానికి అనుమతిస్తుంది. మనస్తత్వశాస్త్ర నిపుణులకు మందులను సూచించే అర్హత లేదు. వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత డీపీఎం లేదా ఎండీ (సైకియాట్రీ) చేసినవారిని మనోవిజ్ఞానశాస్త్ర నిపుణులు అంటారు. వీరు మానసిక రుగ్మతలకు మందుల ద్వారా చికిత్స అందిస్తారు.

విభిన్న కోర్సులు
చైల్డ్‌ సైకాలజీ, క్లినికల్‌, కౌన్సెలింగ్‌, ఎడ్యుకేషనల్‌, పారిశ్రామిక మనోవిజ్ఞానశాస్త్రం, ఆరోగ్య మనస్తత్వశాస్త్రం... ఇలా అనేక విభాగాలు ఉన్నాయి. వాటిలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎంఏ లేదా ఎంఎస్సీ స్థాయిలో వాటిని ఐచ్ఛికంగా ఎంచుకున్నవారికి ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
డిగ్రీ: బీఏ లేదా బీఎస్సీ సైకాలజీని డిగ్రీస్థాయిలో చదువుకోవచ్చు. దీనికి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు కాలవ్యవధి మూడు సంవత్సరాలు. రెగ్యులర్‌తో పాటు దూరవిద్యావిధానంలోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అన్ని విశ్వవిద్యాలయాలూ సీబీసీఎస్‌  (ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం) విధానంలో ఆరు సెమిస్టర్లుగా డిగ్రీ కోర్సును అందిస్తున్నాయి. వీటిల్లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు.

పీజీ: పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి కొన్ని యూనివర్శిటీలు ఎంఏ సైకాలజీ, మరికొన్ని యూనివర్శిటీలు ఎంఎస్సీ సైకాలజీ డిగ్రీ అందిస్తున్నాయి. వీటికి అదనంగా ఇంకొన్ని యూనివర్శిటీలు ఎంఎస్సీలో హెల్త్‌ సైకాలజీ, మెడికల్‌ సైకాలజీ, క్లినికల్‌ సైకాలజీ, అప్లైడ్‌ సైకాలజీ పేరుతో కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు లేదా డిగ్రీలో సైకాలజీని ఒక సబ్జెక్ట్టుగా అధ్యయనం చేసినవారు ఈ కోర్సులో చేరవచ్చు. కాల వ్యవధి రెండు సంవత్సరాలు. రెగ్యులర్‌గా చదవాలంటే యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. దూరవిద్యావిధానంలో అయితే ఎటువంటి ప్రవేశపరీక్ష లేకుండా నేరుగానే ఆయా కోర్సుల్లో చేరవచ్చు.
పీజీ డిప్లొమా: ఒక సంవత్సరం కాలవ్యవధి ఉండే రెగ్యులర్‌ కోర్సులోకి  పరీక్ష ద్వారా ఎన్‌సీఈఆర్‌టీ ప్రవేశం కల్పిస్తోంది. ఎంఏ లేదా ఎంఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు పొందినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. దూరవిద్యావిధానం ద్వారా అనేక యూనివర్శిటీలు నేరుగా ప్రవేశాలను ఇస్తున్నాయి. స్కూల్‌ కౌన్సెలర్లుగా చేరాలంటే ఈ కోర్సు తప్పనిసరిగా చేయాలి.
పరిశోధన స్థాయిలో: రెండేళ్ల కాల వ్యవధి ఉండే  ఎం.ఫిల్‌లో క్లినికల్‌ సైకాలజీ చదవాలంటే భారత పునరావాస మండలి (ఆర్‌సీఐ) నిబంధనల ప్రకారం ఎంఏ లేదా ఎంఎస్సీ సైకాలజీ కోర్సు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో మెరిట్‌ సాధించాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత ఆర్‌సీఐలో అధికారికంగా పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకుని సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.
సైకాలజీ లేదా క్లినికల్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేయడానికి పీజీలో కనీసం 55 శాతం మార్కులతో పాటు యూనివర్శిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరి. యూజీసీ నిర్వహించే నెట్‌్, జేఆర్‌ఎఫ్‌ల్లో అర్హత సాధిస్తే పీ‡హెచ్‌డీ…లోకి నేరుగా ప్రవేశం పొందవచ్చు. పీహెచ్‌డీ క్లినికల్‌ సైకాలజీలోకి మాత్రం యూనివర్సిటీలు ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు ఇస్తున్నాయి.


ఉపాధి అవకాశాలు
కేంద్రీయ మాధ్యమిక విద్యాసంస్థ (సీబీఎస్‌ఈ) గుర్తింపు పొందిన ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మనస్తత్వశాస్త్ర నిపుణుడిని నియమించాలి. వీరికి శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయుడి హోదా ఇవ్వాలి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటిన ప్రతి కళాశాలలో ఒక మనస్తత్వశాస్త్ర నిపుణుడిని నియమించాలి.దీని ప్రకారం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సైకాలజిస్టుల, సైకియాట్రిస్టుల అవసరం వేల సంఖ్యలో ఉంది.
పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలర్లు, మానసిక వికలాంగుల పాఠశాలలు, వికలాంగుల పునరావాసకేంద్రాలు, చైల్డ్‌ గైడెన్స్‌ క్లినిక్‌లు, రక్షణ పరిశోధన సంస్థలు, వ్యక్తిత్వ వికాసకేంద్రాలు, వివాహ మంత్రణ కేంద్రాలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, మానసిక ఆరోగ్య కేంద్రాలు, హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు, మార్కెటింగ్‌ విభాగాలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రాలు, ఒకేషనల్‌ గైడెన్స్‌ కేంద్రాల్లో సైకాలజీ అధ్యయనం చేసినవారికి ఉద్యోగావకాశాలున్నాయి.
విద్య, పారిశ్రామిక రంగాల్లో సైకాలజిస్టులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.70 వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకుంటే ఇంతకన్నా ఎక్కువ సంపాదించే వీలుంది. విదేశాల్లోనూ వీరికి మంచి డిమాండ్‌ ఉంది.


అందిస్తున్న సంస్థలు
ఆంధ్ర, ఆదికవి నన్నయ, ఉస్మానియా, కాకతీయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు రెగ్యులర్‌ విధానంతో పాటు దూరవిద్య ద్వారా కూడా పీజీ సైకాలజీ కోర్సు అందిస్తున్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో వీటిలో చేరవచ్చు. కోర్సు కాలపరిమితి రెండేళ్లు.
* కృష్ణ విశ్వవిద్యాలయం, విజయవాడలోని ఎస్‌.ఆర్‌.ఆర్‌. కళాశాల నుంచి రెగ్యులర్‌ విధానంలో ఎంఎస్సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది.* హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ విధానంలో ఎంఎస్‌సీ హెల్త్‌ సైకాలజీ కోర్సు అందిస్తోంది. * యోగి వేమన యూనివర్శిటీ రెగ్యులర్‌ విధానంలో ఎంఎస్‌సీ సైకాలజీ కోర్సు అందిస్తోంది. *ఉస్మానియా యూనివర్శిటీ ఆర్‌సీఐ అనుమతితో ఎం.ఫిల్‌ క్లినికల్‌ సైకాలజీ కోర్సు నిర్వహిస్తోంది


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి